England: ఇంగ్లండ్ లో మరోసారి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధింపు!

  • భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు
  • ఫిబ్రవరి రెండో వారం వరకూ లాక్ డౌన్
  • ప్రజలు సహకరించాలన్న బోరిస్ జాన్సన్
Another Full Lockdown in England

బ్రిటన్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతూ ఉండటంతో మరోసారి పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దీంతో దాదాపు 5.6 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫిబ్రవరి రెండో వారం వరకూ ఫుల్ లాక్ డౌన్ కొనసాగుతుందని తెలుస్తోంది.

లాక్ డౌన్ లో భాగంగా స్కూళ్లు మొత్తం మూతబడతాయని, లాక్ డౌన్ బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జాన్సన్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఫుల్ లాక్ డౌన్ పెడుతున్నట్టు స్కాట్ లాండ్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే బోరిస్ జాన్సన్, తన ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.

కాగా, ఇంగ్లండ్ లోని ప్రజల్లో దాదాపు మూడొంతుల మంది ఇప్పటికే పలు కఠిన ఆంక్షల మధ్య, తమ దైనందిన కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే కరోనా సోకిన కారణంగా సంభవించిన మరణాల విషయంలో బ్రిటన్ గణాంకాలు భీతి గొలిపేలా ఉన్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించడంలో ప్రభుత్వం విఫలం కాగా, మ్యూటేషన్ చెందిన వైరస్ వెలుగులోకి రావడంతో పరిస్థితి మరింత దిగజారింది.

సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 27 వేల మంది కొవిడ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో ఉన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ లో వచ్చిన ఫస్ట్ వేవ్ తో పోలిస్తే, ఈ సంఖ్య 40 శాతం అధికం. ఇంగ్లండ్ జాతీయ స్థాయి లాక్ డౌన్ లోకి మరోసారి వెళ్లక తప్పనిసరి పరిస్థితి నెలకొని వుందని, ప్రజలు సహకరించాలని జాన్సన్ కోరారు.

More Telugu News