Note for Vote: చంద్రబాబు సమక్షంలోనే 'ఓటుకు నోటు' డీల్ .. ఈడీ ఎదుట మత్తయ్య కీలక వాంగ్మూలం

  • 30 ఏళ్లుగా స్టీఫెన్ సన్ స్నేహితుడు
  • హిమాయత్ సాగర్ మహానాడులో మాట్లాడిన చంద్రబాబు
  • రేవంత్ పట్టుబడిన తరువాతే నా పేరు బయటకు
  • విజయవాడలో తలదాచుకోవాలని లోకేశ్ చెప్పారు
  • ఈడీ విచారణలో మత్తయ్య 
Note for Vote Deal infront of Chandrababu Told Mattaiah in ED Enquiry

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసులో మొత్తం డీల్ చంద్రబాబు నాయుడి సమక్షంలోనే జరిగిందని, కేసులో నాలుగో నిందితుడైన జెరూసలెం మత్తయ్య ఈడీకి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈడీ వర్గాల సమాచారం వివరాల ప్రకారం, తాను క్రిస్టియన్‌‌ ఆర్గనైజేషన్స్‌‌ నిర్వహిస్తుంటానని, తనకు స్టీఫెన్ ‌‌సన్‌‌ 30 ఏళ్లుగా స్నేహితులని మత్తయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నామినేటెడ్‌‌ ఎమ్మెల్యే పోస్టు కోసం సిఫార్సు‌‌ చేయాలని స్టీఫెన్ సన్ కోరినట్టు వెల్లడించారు. అలా జరగాలంటే, టీఆర్ఎస్ పార్టీకి గానీ లేదా కవిత, కేటీఆర్ లలో ఎవరికైనా ఫండ్స్ ఇవ్వాలని సూచించినట్టు పేర్కొన్నట్టు సమాచారం.

ఆపై 2015లో తాము బషీర్ బాగ్ లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌‌ సన్‌‌, టీడీపీ యువజన విభాగం కార్యదర్శి జిమ్మిబాబు, తాను కలిశామని, అప్పుడే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ‌‌పై తమ మధ్య చర్చ జరిగిందని, ఆపై చంద్రబాబు, రేవంత్ ‌‌రెడ్డిలను కలవడానికి హిమాయత్‌‌ సాగర్ ‌‌‌‌లో నిర్వహించే మహానాడుకు రావాలని జిమ్మిబాబు చెప్పాడని తెలిపారు.

తాను అక్కడికి వెళ్లానని, చంద్రబాబు, రేవంత్ తనతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వేం నరేందర్‌‌‌‌ రెడ్డికి స్టీఫెన్‌‌ సన్‌‌తో క్రాస్‌‌ ఓటింగ్‌‌ చేయించాలని చంద్రబాబు స్వయంగా కోరారని, స్టీఫెన్ ‌‌సన్‌‌ ను ఒప్పించాలని అడిగారని చెప్పుకొచ్చారు. నరేందర్‌‌‌‌ రెడ్డికి ఓటు వేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్ కు దూరంగా ఉంటే రూ.3 కోట్లు, డీల్ సెట్ చేస్తే తనకు రూ. 50 లక్షలు ఇస్తామని అన్నారని అధికారులకు మత్తయ్య తెలిపారు.

ఆ తరువాతి రోజునే తాను స్టీఫెన్ ‌‌సన్ ‌‌ను కలిసి, ఆఫర్‌‌‌‌ గురించి చెబితే, తొలుత ఆయన నమ్మలేదని, ఆపై సెబాస్టియన్‌‌, రేవంత్ ‌‌తో కలిసి రెండుసార్లు ఆయన ఇంటికి వెళ్లానని, ఆ సమయంలోనే చంద్రబాబు సైతం ఫోన్ చేసి స్టీఫెన్ సన్ తో మాట్లాడిన విషయాన్ని సెబాస్టియన్‌‌ చెప్పారని అన్నారు. స్టీఫెన్‌ ‌సన్‌ ‌కు రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్‌‌, ఏసీబీకి చిక్కడంతోనే తన పేరు బయటకు వచ్చిందని, ఆపై లోకేశ్ ను కలవగా, తనను విజయవాడకు వెళ్లమని చెప్పారని మత్తయ్య పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

More Telugu News