Tirupati: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సైకి వీఆర్.. తిరుపతి ఎస్పీ ఆదేశాలు

  • ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై బెల్టుతో దాడి
  • ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా
  • విచారణ జరిపించి వేటువేసిన ఎస్పీ
Mutyalapalli SI sent to VR

ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన మహిళను బెల్టుతో చితకబాదిన తిరుపతి ఎస్సై ప్రకాశ్‌ కుమార్‌పై వేటుపడింది. ఆయనను వేకెన్సీ రిజర్వు (వీఆర్)కు పంపిస్తూ తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేశ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించిన విషయం వాస్తవమేనని తేలడంతో ఆయనను వీఆర్‌కు పంపించారు.

తిరుపతి రూరల్ మండలంలోని ఉప్పరపల్లికి చెందిన వనితా వాణి ఆటో నడుపుతూ జీవిస్తోంది. శనివారం ఆమె ఇంటి గార్డెన్‌లోకి గేదెలు వచ్చి ధ్వంసం చేశాయి. దీంతో ఆమె గేదెలు బయటకు వెళ్లకుండా తాళం వేసింది. విషయం తెలిసిన గేదెల యజమానులు ఆమెతో వాగ్వివాదానికి దిగి, దాడి చేసి గేదెలను తీసుకెళ్లిపోయారు.

దీంతో బాధితురాలు వాణి ఫిర్యాదు చేసేందుకు ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అదే సమయంలో పూజలు చేసేందుకు స్టేషన్ గదులను శుభ్రం చేస్తున్నారు. విషయం తెలియని ఆమె నేరుగా లోపలికి వెళ్లడంతో చూసిన ఎస్సై ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెను దుర్భాషలాడాడు. ఎందుకలా తిడుతున్నారని ప్రశ్నించడంతో మరింత ఊగిపోయిన ఎస్సై ప్రకాశ్ కుమార్ బెల్టుతో ఆమెపై దాడిచేశాడు.

ఎస్సైపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్తే ఆయన లేరని తెలిసి మళ్లీ స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగింది. విషయం తెలిసిన సీఐ సురేంద్రనాథ్ రెడ్డి స్టేషన్‌కు చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ధర్నా విరమించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ విచారణ జరిపించి ఎస్సైపై చర్యలు తీసుకున్నారు.

More Telugu News