KTR: ఇక్కడ ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏం జరిగిందో చూశారుగా?: యోగికి కేటీఆర్ కౌంటర్

  • యూపీలో ప్రభుత్వం ఏమీ చేయట్లేదు
  • ఏడాది క్రితం ఏమైందో చూశాము
  • ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?
  • గ్రేటర్ అభివృద్ధికి టీఆర్ఎస్ గెలవాల్సిందేనన్న కేటీఆర్
TRS Should win in GHMC says KTR

మరికొన్ని గంటల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న వేళ, నిన్న ప్రచారం ముగియడానికి ముందు నేతల మధ్య పెద్ద వాగ్యుద్దమే జరిగింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారానికి వచ్చిన వేళ, తెలంగాణలో ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించగా, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఏడాది క్రితం ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, హైదరాబాద్ లో ఏం జరిగిందో అందరూ చూశారని అన్నారు. యూపీలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, ప్రభుత్వం ఏమి చేస్తోందో కూడా చూశామని సెటైర్లు వేశారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ లెక్కన ఈ ఆరేళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు రావాల్సి వుండగా, కొత్త ఉద్యోగాల బదులు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి తీరాల్సి వుందని, టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్లను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే, కేవలం రూ.1.40 లక్షల కోట్లను మాత్రమే ఇచ్చారని, ఇది రూపాయి కడితే ఆఠాణా ఇచ్చినట్టని సెటైర్లు వేశారు.

ప్రజలకు ఏమీ చేయని బీజేపీ, పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటోందని వ్యాఖ్యానించిన కేటీఆర్, ఐటీ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పిన బీజేపీ ఐటీఐఆర్ ను రద్దు చేసిందని, దాని ఫలితంగా యువత నోట్లో మట్టి కొట్టినట్లయిందని అన్నారు. తెలంగాణలో నిజాం సంస్కృతిపోయి, 1920లోనే గాంధీ సామరస్యత వచ్చిందని, గడచిన ఆరేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు.

More Telugu News