'ఉగ్ర'కరోనాతో జాగ్రత్త... ఐరాస అనుబంధ సంస్థ ఆసక్తికర వెల్లడి
- ఐసిస్, అల్ ఖైదా సరికొత్త కుట్ర సిద్ధాంతం
- తమకు తామే కరోనా సోకేలా చేసుకుంటున్న ఉగ్రవాదులు
- బహిరంగ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం ద్వారా వైరస్ వ్యాప్తికి దోహదం
కొన్ని విచ్ఛిన్నకర శక్తులు కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని, ముఖ్యంగా ఐసిస్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సరికొత్త కుట్రకు తెరదీస్తున్నాయని యూఎన్ఐసీఆర్ఐ వెల్లడించింది. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు కరోనా సోకేలా చేసుకుని వైరస్ బాంబుల్లా తయారవుతున్నారని పేర్కొంది. ఆపై వారు జనసమూహాల్లోకి వెళ్లి బహిరంగంగా తుమ్మడం, దగ్గడం వంటి చర్యలకు పాల్పడతారని, తద్వారా ప్రజల్లో మృత్యు వైరస్ మరింత వ్యాపించేందుకు దోహదపడతారని వివరించింది.
ఈ విధమైన నూతన దాడులను ఉగ్రసంస్థలు ప్రోత్సహిస్తున్నాయని యూఎన్ఐసీఆర్ఐ తన నివేదికలో వెల్లడించింది. ఈ తరహా కుట్ర సిద్ధాంతాల ప్రచారం కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారని తెలిపింది.