Anil Kumar Yadav: వచ్చే ఏడాది డిసెంబరు నాటికి మా ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తుంది: మంత్రి అనిల్ కుమార్

AP Minister Anil Kumar says their government will be completed Polavaram
  • పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్
  • అధికారులతో సమీక్ష
  • టీడీపీ నేత దేవినేని ఉమాపై విమర్శల వర్షం
ఏపీ నీటిపారుదల శాఖ మంతి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, 2021 డిసెంబరు నాటికి తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుందని వెల్లడించారు. తరువాతి ఖరీఫ్ సీజన్ కు గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేత దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. పోలవరం నిర్మాణ పనులు ఎక్కడా దారితప్పడంలేదని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే టేపుతో కొలుచుకోవచ్చని మరోసారి చెబుతున్నానని అనిల్ అన్నారు. దేవినేని ఉమ తమపై విమర్శలు చేయడం తగదని స్పష్టం చేశారు.

"జగన్ పబ్జీ ఆడుతున్నారని, అనిల్ ఐపీఎల్ ఆడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నావు. నువ్వు చెమ్మ చెక్క ఆడుతున్నావా? లేస్తే బూతుల మంత్రి అంటున్నావు... నువ్వు గతంలో మాట్లాడిన దానికంటే చాలా తక్కువే మాట్లాడుతున్నాం. అయినా, నువ్వు ఎవరినో చంపావని అంటున్నారు... కృష్ణా జిల్లాలో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో. పోలవరం అంశంలో కమీషన్లకు కక్కుర్తిపడింది మీరే" అంటూ ధ్వజమెత్తారు.
Anil Kumar Yadav
Polavaram Project
YSRCP
Devineni Uma
Telugudesam
Andhra Pradesh

More Telugu News