KCR: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది: అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్

  • హైదరాబాద్‌లో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు
  • పెద్ద ఎత్తున వరద నీరు
  • నగరంలోని చెరువులన్నీ నిండిపోయాయి 
  • గండి పడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలున్నాయి
kcr on rains

జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారని సీఎంవో తెలిపింది.

హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారని సీఎంవో పేర్కొంది. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని, దీనికితోడు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలోని చెరువుల ద్వారా కూడా చాలా నీరు వచ్చి చేరడంతో నగరంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయని చెప్పారని తెలిపింది.

ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని కేసీఆర్ అన్నారని సీఎంవో చెప్పింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారని పేర్కొంది. చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు, చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండి పడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారని తెలిపింది.

నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచనలు చేశారని సీఎంవో తెలిపింది. చెరువుల కట్టలు తెగే లేదా గండ్లు పడే అవకాశం ఉన్న చోట వెంటనే మరమ్మత్తులు చేయడానికి సిద్ధంగా ఉండాలని, వరద నీటి ముంపు ప్రమాదమున్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ ఆదేశించారని పేర్కొంది.

More Telugu News