Maruti Suzuki: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మారుతీసుజుకి ఆఫర్

  • రూ.11 వేల మేర ప్రయోజనాలు
  • కొత్త కార్ల కొనుగోళ్లపై వర్తింపు
  • కోటి మంది ఉద్యోగులకు సదుపాయం
Maruti Suzuki offers special benefits for government employs

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీసుజుకి పండుగ సీజన్ లో భారీగా అమ్మకాలకు సంసిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్ లో తమ కార్లు కొనుగోలు చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మారుతి రూ.11 వేలకు బెనిఫిట్స్ అందించనుంది. విటారా బ్రెజా, ఇగ్నిస్, ఎస్ క్రాస్, ఎర్టిగా, సెలెరియో, ఆల్టో, వ్యాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో, ఈకో, బాలెనో, స్విఫ్ట్ డిజైర్, ఎక్స్ఎల్6 మోడళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది కొత్త కారు కొనే సమయంలో ఈ మేరకు ప్రయోజనం పొందవచ్చని మారుతీసుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కోటి మంది ఉద్యోగులు ఈ స్పెషల్ ఆఫర్ కు అర్హులని తెలిపారు. పండుగ సీజన్లలో ప్రభుత్వాలు ఉద్యోగులకు అందించే ఎల్టీసీ సదుపాయానికి అదనంగా తాము బెనిఫిట్స్ అందిస్తున్నామని చెప్పారు.

ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు కేంద్రం పలు చర్యలు ప్రకటించిందని, అందుకు దన్నుగా తమవంతు ఆఫర్ ప్రకటించామని మారుతీసుజుకి వెల్లడించింది.

More Telugu News