Local Body Polls: స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమన్న ఏపీ సర్కారు... ఆ మాట మీరెలా చెబుతారన్న న్యాయస్థానం!

  • కరోనా వ్యాప్తితో వాయిదాపడిన స్థానిక ఎన్నికలు
  • హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది తాండవ యోగేశ్
  • ఎస్ఈసీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
  • తదుపరి విచారణ నవంబరు 2కి వాయిదా
High Court hears petition to seeking orders for Local Body election in AP

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. కరోనా పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని, తాము నిర్వహించలేమని ప్రభుత్వం కోర్టుకు విన్నవించుకుంది.

అయితే, ఎన్నికల నిర్వహణ అంశం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోని విషయం కాబట్టి, నిర్వహించగలరో లేదో చెప్పాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘమేనని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు, కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కదా అని కూడా న్యాయస్థానం ప్రస్తావన తీసుకువచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ఎస్ఈసీ వివరణ ఇవ్వాలంటూ ఆ మేరకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.

More Telugu News