Unlock 5.0: ఏపీలో అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల!

  • ఇటీవలే మరిన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం
  • కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రం మార్గదర్శకాలు
  • అక్టోబరు 15 నుంచి అమలు
AP Government issues new unlock guidelines

కేంద్రం ఇటీవలే మరిన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీలో అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేశారు. అక్టోబరు 15 నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్రం ఇటీవల ఇచ్చిన సడలింపులతో జనజీవనం దాదాపు సాధారణ స్థితికి వచ్చిందని చెప్పాలి. అంతర్జాతీయ విమాన సర్వీసులు, పూర్తిస్థాయిలో రైళ్లు తిరగడం తప్పించి అన్ని అంశాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధాన వినోద మాధ్యమం సినిమా కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. మరోవారంలో సినిమా హాళ్లు కూడా తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో ఏపీ సర్కారు అక్టోబరు 15 నుంచి అమల్లోకి వచ్చేలా తాజా మార్గదర్శకాలు వెల్లడించింది.

  • సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద శానిటైజర్లు తప్పనిసరి. మాస్కు లేనివారికి ప్రవేశం నిషేధం.
  • రద్దీగా ఉండే ప్రదేశాల్లో విధిగా భౌతికదూరం పాటించాలి.
  • బస్సులు, ఇతర రవాణా వాహనాల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
  • ప్రార్థనా మందిరాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి.
  • బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మాస్కులు ధరించాలంటూ మైక్ ల ద్వారా ప్రచారం.
  • కొవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి.
  • సినిమా థియేటర్లలో కరోనా నివారణపై టెలీ ఫిల్మ్ ద్వారా ప్రచారం.
  • స్కూళ్లు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో కేంద్రం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి.
  • పాఠశాలల్లో ప్రతి పీరియడ్ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు శానిటైజేషన్ చేసుకోవాలి.

కాగా, ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా నివారణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిపారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులను అడిగి సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారు. మున్ముందు కూడా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కరోనా నియంత్రణను సమర్థంగా నిర్వర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

More Telugu News