SP Balasubrahmanyam: నాన్న ఇంకా ఎక్మో, వెంటిలేటర్ పైనే ఉన్నారు: ఎస్పీ బాలు కుమారుడు

  • నాన్న ఆరోగ్యం నెమ్మదిగా మెరుగవుతోంది
  • ప్రతి రోజు నాన్నను కలుస్తూనే ఉన్నా
  • కొన్ని మీడియాల్లో తప్పుడు వార్తలు వస్తున్నాయి
SP Balu still on ventilator says his son

నాన్న ఆరోగ్యం నెమ్మదిగా, క్రమంగా మెరుగవుతోందని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ తెలిపారు. రోజుల వ్యవధిలోనే అత్యంత వేగంగా ఆయన కోలుకోలేరని చెప్పారు. ఈ కారణం వల్లే తాను ప్రతి రోజు అప్ డేట్స్ ఇవ్వడం లేదని చెప్పారు.

ప్రతి రోజు ఒకే విషయం వెల్లడించినట్టు ఉంటుందనే రెండు రోజులకు ఒకసారి అప్ డేట్స్ ఇస్తున్నానని తెలిపారు. తాను ప్రతి రోజు నాన్నను కలుస్తున్నానని... ఆయన బాగున్నారని చెప్పారు. నాన్నకు ఎక్మో, వెంటిలేటర్ సపోర్ట్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. నాన్న స్పృహలోనే ఉన్నారని అన్నారు. ఇన్ఫెక్షన్లు, ఇతర ఇబ్బందులు లేవని చెప్పారు.  

పోతే, నాన్న ఆరోగ్యం గురించి కొన్ని మీడియాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయని, వారికి ఆ సమాచారం ఎక్కడ నుంచి వస్తోందో తనకు తెలియదని, అలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. కచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాను వెల్లడిస్తానని చెప్పారు.

నాన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించడం కోసం తాము అప్లై చేశామనీ.. ఇలా రకరకాలుగా వస్తున్న వార్తలను మాత్రం నమ్మొద్దని చెప్పారు. తన అభిమానుల కోసం ఐసీయూ నుంచి ఆయన పాటలు పాడుతున్నారనే వార్తల్లో కూడా నిజం లేదని తెలిపారు.

More Telugu News