Vinayaka Chavithi: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు... ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర షురూ

  • రేపు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
  • సీసీటీవీ కెమెరాలతో నిఘా
  • నేడు మధ్యాహ్నం 3 గంటలలోగా మహాగణపతి నిమజ్జనం
  • కాస్త తగ్గిన సందడి
ganesh nimajjanam in tankband

నేడు వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. గత అర్థరాత్రి నుంచే నగరంలోకి అంతర్రాష్ట్ర, జిల్లాల లారీలకు అనుమతి నిలిపివేశారు. గణేశ్‌ ప్రతిమల నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా, కట్టుదిట్టమైన పోలీసు‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలలోగా మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుందని ఉత్సవ కమిటీ తెలిపింది. ప్రతి ఏడాది హైదరాబాద్‌లో ఉండే సందడి కాస్త తగ్గింది. గణనాథుడి ఉత్సవాలు నిరాడంబరంగా సాగిన నేపథ్యంలో నిమజ్జనంలో కూడా గతంలోలా పెద్దగా హడావుడి చేయట్లేదు.  

ప్రతిసారి భారీ ఎత్తు ఉండే గణనాథులు ట్యాంక్‌బండ్‌ వద్దకు వచ్చేవి. ఈ సారి కరోనా నేపథ్యంలో ఎత్తు తక్కువగా ఉండే గణేశ ప్రతిమలనే భక్తులు కొనుగోలు చేసి, స్వయంగా తయారు చేసుకుని పూజలు చేశారు. దీంతో ట్యాంక్‌ బండ్‌ వద్ద చిన్నసైజు గణనాథుడి విగ్రహాలే కనపడుతున్నాయి.

నిమజ్జనం కోసం భక్తులు ట్యాంక్‌బండ్‌  వైపు తరలివస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌లో వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్న చెరువుల వద్దా ప్రత్యేక ఏర్పాటు చేశారు.

More Telugu News