Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం

  • బెంగళూరు నుంచి నెల్లూరు వస్తుండగా ఘటన
  • స్వల్పగాయాలతో బయటపడిన కోడలు
  • కారులో మృతి చెందిన తల్లిదండ్రులు, కుమారుడు
Four dead in a road accident in Chittoor district

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఐలూరిపల్లెకు చెందిన బేరి శ్రీనివాసులురెడ్డి (53) మాజీ సైనికోద్యోగి. బెంగళూరులోని కుందనహళ్లిలో నివసిస్తున్న ఆయన పదవీ విరమణ అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నెల్లూరులో ఓ హోటల్ రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం భార్య రత్నమ్మ (48), కుమారుడు వెంకటేశ్వరరెడ్డి (28), కోడలు శిరీష (24)తో కలిసి ఆదివారం కారులో బెంగళూరు నుంచి నెల్లూరు బయలుదేరారు.

ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలంలోని బలిజపల్లి సమీపంలో ఓ ద్విచక్రవాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న శ్రీనివాసులు రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రత్నమ్మలు ప్రాణాలు కోల్పోగా, శిరీష స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు, కారును ఢీకొట్టిన బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెకు చెందిన సయ్యద్ హుస్సేన్ (48) కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News