Pranab Mukherjee: మచ్చలేని రాజకీయాలకు మరోపేరు... ప్రణబ్!

  • ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
  • సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వివాదరహితుడిగా గుర్తింపు
  • ప్రణబ్ ను వరించిన భారతరత్న, పద్మవిభూషణ్
Story on former president of India Pranab Mukherjee

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమయం చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ మృతితో రాజకీయపార్టీలకు అతీతంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రణబ్ పూర్తిపేరు ప్రణబ్ కుమార్ ముఖర్జీ. ఆయన 1935 డిసెంబరు 11న బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిరాఠీ (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఉంది) గ్రామంలో జన్మించారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వాతంత్ర్య సమర యోధుడు. తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జీ. ప్రణబ్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ సబ్జెక్టుల్లో ఎంఏతో పాటు ఎల్ఎల్ బీ పట్టా కూడా అందుకున్నారు. ప్రణబ్ కు అక్కయ్య అన్నపూర్ణ, తమ్ముడు పియూష్ ఉన్నారు.

ప్రణబ్ కుటుంబం విషయానికొస్తే.... ఆయనకు 1957లో సువ్రాతో వివాహం జరిగింది. ప్రణబ్-సువ్రా ముఖర్జీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ఠ రాజకీయాల్లో ఉన్నారు. ప్రణబ్ మొదట్లో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో యూడీసీ గా పనిచేశారు. ఆ తర్వాత కోల్ కతాలోని విద్యానగర్ కాలేజీలో అధ్యాపకుడిగా వ్యవహరించారు. రాజకీయాల్లోకి రాకముందు దేషేర్ డాక్ అనే పత్రికలో జర్నలిస్టుగానూ సేవలు అందించారు.

ఆపై  ప్రణబ్ ప్రతిభను గుర్తించిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించారు. ఆయనను ఎంతో ప్రోత్సహించారు. 1969లో రాజ్యసభకు వెళ్లడం ఆయన పొలిటికల్ కెరీర్ లో ఓ మలుపు అని చెప్పాలి. అక్కడి నుంచి 75, 81, 93, 99లోనూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో లోక్ సభకు ఎన్నికైన ఆయన 2012 వరకు కొనసాగారు. అంతకుముందు 1993 నుంచి 1995 వరకు కేంద్ర వాణిజ్యమంత్రిగా, 1995 నుంచి 1996 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. 2006 నుంచి 2009లోనూ అవే బాధ్యతలు నిర్వర్తించారు.

2004 నుంచి 2006 వరకు రక్షణమంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థికమంత్రిగా పదవులు అలంకరించారు. 2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తర్వాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన 2017 వరకు కొనసాగారు. ప్రణబ్ భారత్ లోనే కాదు అంతర్జాతీయంగానూ పలు పదవులకు వన్నె తెచ్చారు. భారత ఆర్థికమంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్ మెంట్ బ్యాంకుల బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తించారు.

మచ్చలేని రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు 2008లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. 2019లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. ముఖ్యంగా గాంధీల కుటుంబానికి సన్నిహితుడిగా గుర్తింపు పొందడమే కాదు, వారికి అన్ని విధాలా అండగా నిలిచారు.  

More Telugu News