manda krishna: ఆ అత్యాచారం కేసుతో యాంకర్‌ ప్రదీప్‌ కు సంబంధం లేదు!: మంద కృష్ణ మాదిగ

  • 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల యువతి ఫిర్యాదు
  • ఆమెతో మాట్లాడిన మందకృష్ణ
  • యాంకర్ ప్రదీప్‌కు సంబంధం లేదని వ్యాఖ్య
  • డాలర్ బాయ్ ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై‌ బాధితురాలు కేసు?
manda krishna on alegations on anchor pradeep

తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2009 నుంచి తనపై వారు ఈ అఘాయిత్యానికి తెగబడ్డారంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో పలువురి పేర్లను కూడా చెప్పింది.

ఈ నేపథ్యంలో తనపై పలు ఆరోపణలు వస్తుండడంతో యాంకర్ ప్రదీప్‌ ఇప్పటికే దీనిపై స్పందిస్తూ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. కాగా, బాధితురాలికి అండగా నిలిచిన పలు కుల, మహిళా సంఘాలు  ఈ రోజు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించాయి.

ఈ సందర్భంగా  మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. యాంకర్‌ ప్రదీప్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. డాలర్ బాయ్ ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై‌ బాధితురాలు కేసు పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు పూలన్ దేవి గుర్తుకొచ్చిందని మంద కృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు.

ఆమె కూడా ఎన్నోసార్లు అఘాయిత్యానికి గురయ్యారని చెప్పారు. తాజాగా, ఓ యువతిపై 139 మంది అత్యాచారం చేశారని తెలుసుకుని తాను విస్మయం చెందానని అన్నారు. సీసీఎస్ పోలీసులను ఈ కేసుల విషయంపై తమ బృందం సంప్రదించిందని, ఒక మహిళా ఏసీపీ కేసును విచారిస్తున్నారని తమకు తెలిసిందని అన్నారు.

తాను నిన్న దాదాపు 2 గంటల పాటు బాధితురాలితో మాట్లాడానని, 39 మందిపై రేప్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని చెప్పారు. 139 మందిలో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారని తెలిసిందని చెప్పారు. మరో 30 శాతం మంది ఆమెను మానసికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేశారని, మిగతా 40 శాతం మందికి ఈ కేసుతో సంబంధం లేదని ఆయన అన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ మీసాల సుమన్ ఈ యువతి జీవితంలోకి ప్రవేశించిన అనంతరమే బ్లాక్ మెయిల్‌కు గురికావడం ప్రారంభమైందని చెప్పారు. డాలర్ బాయ్ అమ్మాయితో కేసులు పెట్టించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేశాడని ఆయన తెలిపారు. డాలర్ బాయ్ కూడా ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. మీసాల సుమన్ తో పాటు డాలర్ బాయ్‌ను అదుపులోకి తీసుకుని, విచారిస్తే నిజాలు బయటపడతాయని మంద కృష్ణ చెప్పారు.

More Telugu News