Tamil Nadu: తమిళనాడులో దారుణం.. హిజ్రా దంపతుల సహా ముగ్గురి దారుణ హత్య

  • తమిళనాడులోని తిరునెల్వేలి సమీపంలో ఘటన
  • హత్యచేసి గోనె సంచుల్లో చుట్టి బావిలో పడేసిన వైనం
  • పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన తోటి హిజ్రాలు
Two trans women and one man murdered in Tirunelveli

తమిళనాడులో దారుణం జరిగింది. ఓ హిజ్రా, ఆమె భర్తతో పాటు మరో హిజ్రా దారుణ హత్యకు గురయ్యారు. తిరునెల్వేలి సమీపంలోని సూత్తమల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 పోలీసుల కథనం ప్రకారం.. సూత్తమల్లికి చెందిన హిజ్రాలు భవాని, అనుష్క, ఆమె భర్త మురుగన్‌లు గురువారం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో వారితో కలిసి నివసించే సహ హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

వారిచ్చిన సమాచారంతో పాళయంకోట చౌరస్తా సమీపంలో ఉన్న బావిలో గోనె సంచుల్లో కట్టి పడేసిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసిన తోటి హిజ్రాలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News