Amonium Nitrate: బీరుట్ పేలుళ్ల తరువాత... చెన్నైలో వేలం వేసిన 690 టన్నుల అమోనియం నైట్రేట్ హైదరాబాద్ కు తరలింపు!

  • 2015లో పట్టుబడిన అమోనియం నైట్రేట్
  • అప్పటి నుంచి తమిళనాడులోనే నిల్వ
  • ఈ- వేలం విధానంలో తాజాగా విక్రయం
690 Tonnes of Amonium Nitrate Shifted To Hyderabad from Chennai

బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుళ్ల తరువాత, భద్రతా చర్యల్లో భాగంగా చెన్నైలో నిల్వ ఉంచిన 697 టన్నుల అమోనియం నైట్రేట్ వేలం పూర్తికాగా, దాన్ని హైదరాబాద్ కు తరలించినట్టు తెలుస్తోంది. చెన్నై సరకు రవాణా కేంద్రం నుంచి ఈ రసాయనాన్ని తరలించామని తమిళనాడు అధికార వర్గాలు వెల్లడించాయి. కొంత రసాయనం ఇప్పటికే హైదరాబాద్ కు చేరిపోయిందని పోలీసు వర్గాలు వెల్లడించడం గమనార్హం.

తమిళనాడులో భారీ ఎత్తున అమోనియం నైట్రేట్ ను 2015లో కస్టమ్స్ యాక్ట్ 1962 కింద సీజ్ చేయగా, అప్పటి నుంచి దాన్ని నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో నిల్వ ఉంచారు. రాష్ట్రానికి చెందిన ఓ దిగుమతిదారు, ఎరువుల తయారీ నిమిత్తం తీసుకుని వస్తున్నానని అనుమతిని తీసుకుని, సౌత్ కొరియా నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నాడు. అయితే, ఇది ఫర్టిలైజర్ గ్రేడ్ కాకుండా ఎక్స్ ప్లోజివ్ గ్రేడ్ రూపంలో ఉందని గుర్తించిన కస్టమ్స్ అధికారులు, అప్పట్లో అతని దిగుమతి అనుమతులు రద్దు చేశారు.

మొత్తం అమోనియం నైట్రేట్ లో సుమారు 7 టన్నుల వరకూ ఒలికిపోయింది. బీరుట్ పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగతా 690 టన్నులను అధికారులు ఈ వేలం వేశారు. దీన్ని హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేయడంతో దాని తరలింపు ప్రక్రియ చేపట్టారు.

More Telugu News