Raghu Ramakrishna Raju: జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది.. కొత్త రాజధాని అవసరమా?: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

  • అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే రూ. 80 వేల కోట్లు అవసరం
  • సోము వీర్రాజు వ్యాఖ్యలు కూడా సరికాదు
  • జగన్ రెఫరెండంకు వెళ్లాలి
AP is not in a position to pay salaries says Raghu Ramakrishna Raju

వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని... ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మార్పు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోవడం సరికాదని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే రూ. 80 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. రాజధాని గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదని విమర్శించారు.

అమరావతిలో రాజధాని వస్తుందని దాచుకున్న సొమ్ముతో మధ్యతరగతి ప్రజలు భూములు కొన్నారని రఘురాజు చెప్పారు. వారికి అన్యాయం చేయొద్దని కోరారు. అమరావతికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని హైకోర్టు ఆదేశించడం మంచి పరిణామమని చెప్పారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ రెఫరెండంకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులను కూడా బెదిరిస్తున్నారని రఘురాజు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులు తనకు కూడా ఎదురయ్యాయని చెప్పారు. న్యాయ వ్యవస్థపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని... దీనివల్ల ప్రభుత్వానికే నష్టమని అన్నారు.

More Telugu News