Dil Raju: మనోహర్, లాస్య, యశ్వంత్... ఈ ముగ్గురూ ఇక మా కుటుంబంలో సభ్యులే!: దిల్ రాజు

  • అనాథలుగా మారిన చిన్నారులు
  • దిల్ రాజుకు సమాచారం అందించిన ఎర్రబెల్లి
  • చిన్నారులను తమ కుటుంబంలోకి ఆహ్వానించిన దిల్ రాజు
Dil Raju adopts three kids who lost their parents

టాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాత దిల్ రాజు తన పెద్ద మనసు చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారగా, వారి దీనగాథ తెలుసుకుని చలించిపోయిన దిల్ రాజు ఆ ముగ్గురిని తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

ఆత్మకూరు గ్రామానికి చెందిన గట్టు సత్తయ్య, అనురాధ దంపతులకు మనోహర్, లాస్య, యశ్వంత్ అనే పిల్లలున్నారు. మొదట గట్టు సత్తయ్య అనారోగ్యంతో చనిపోగా, ఆ తర్వాత ఆయన భార్య అనురాధ కూడా కన్నుమూశారు. దాంతో మనోహర్, లాస్య, యశ్వంత్ దిక్కలేనివారయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా తెలుసుకున్న దిల్ రాజు కదిలిపోయారు. వెంటనే వారి బాధ్యతలు తాను స్వీకరిస్తానని ముందుకొచ్చారు.

సామాజిక సేవా కార్యక్రమాల కోసం తమ కుటుంబం 2018లో 'మా పల్లె చారిటబుల్ ట్రస్ట్' స్థాపించిందని, ఇప్పుడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ముగ్గురు చిన్నారుల బాగోగులు చూసుకుంటామని దిల్ రాజు వెల్లడించారు. ఇక నుంచి మనోహర్, లాస్య, యశ్వంత్ తమ కుటుంబంలో సభ్యులేనని ఆయన స్పష్టం చేశారు. ఆ ముగ్గురు తోబుట్టువుల విషయాన్ని తన దృష్టికి తెచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని దిల్ రాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మనోహర్, లాస్య, యశ్వంత్ లను ఎంతో సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News