విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన సోము వీర్రాజుకు సమస్యలపై అవగాహన ఉంది: పవన్ కల్యాణ్
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన సోము వీర్రాజుకు క్షేత్రస్థాయిలో పేదల సమస్యలపై అవగాహన ఉందని తెలిపారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సోము వీర్రాజులో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కొనియాడారు. సేవాతత్పరత కూడా కలిగివున్న వీర్రాజు నాయకత్వంలో బీజేపీ ఏపీలో మరిన్ని విజయాలు సాధించాలని జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పవన్ ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీతో కలిసి ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని వివరించారు.