vanita: తన మూడో పెళ్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన సినీ నటి

  • సినీ నిర్మాత రవీంద్రన్‌పై ఫిర్యాదు
  • యూట్యూబ్‌లో తన గురించి ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం
  • సూర్యదేవి అనే మహిళపై కూడా ఫిర్యాదు
  • హద్దులు మీరి, తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని వ్యాఖ్య
vanita gives complaint in police station

ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ కూతురు, నటి వనిత విజయ్ కుమార్ ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఫిలింమేకర్ పీటర్ పాల్‌ను క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లాడింది. పీటర్ పాల్‌కు కూడా గతంలో పెళ్లి జరిగింది. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరిపై పలువురు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా వారిపై విమర్శలు గుప్పిస్తోన్న వారి జాబితాలో సినీ నిర్మాత రవీంద్రన్‌ కూడా చేరారు. దీంతో ఆయనపై వనిత‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనతో పాటు తనపై విమర్శలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోన్న సూర్యదేవి అనే మహిళపై కూడా ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం.

తన న్యాయవాదితో కలిసి చెన్నైలోని పోరూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వారిద్దరిపై ఆమె కేసు పెట్టింది. తన వ్యక్తిగత జీవితంపై కొందరు చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వీడియోలను పోస్ట్ చేయడం సరికాదని విమర్శించింది.

కొన్ని వారాలుగా మీడియాలో తన గురించి అభ్యంతరకర రీతిలో ప్రచారం చేస్తున్నారని మండిపడింది. సూర్యదేవి అనే మహిళ హద్దులు మీరి, తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని తెలిపింది. అలాగే, నిర్మాత రవీంద్రన్‌ సినిమాలు నిర్మించి పేరు తెచ్చుకోకుండా తన యూట్యూబ్‌ చానల్లో సెలబ్రిటీలను వ్యక్తిగత జీవితాలపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారని ఆమె ఆరోపించింది.

తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేయడానికి ఆయన ఎవరు? అని నిలదీసింది. కుటుంబ మద్దతు కూడా లేని తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె వాపోయింది. తాను ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలతో కలసి జీవిస్తున్నానని, ఇటువంటి పరిస్థితుల్లో తోడు కోసం మూడో పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తనపై విమర్శలు చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

More Telugu News