Vizag: విశాఖ ఫార్మా కంపెనీలో పేలుడుపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన కలెక్టర్

  • విచారణ జరిపిస్తామన్న కలెక్టర్ వినయ్ చంద్ 
  • నివేదిక ఇవ్వాలని నలుగురు సభ్యుల కమిటీకి సూచన
  • డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు చెలరేగినట్లు వివరణ
  • అర్హతలేని వ్యక్తి‌ కెమిస్ట్‌గా చేస్తున్నట్లు తెలిపిన అధికారులు 
collector forms committee to investigate vizag fire accident

విశాఖ జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ సంస్థలో గత రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపించడానికి కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి‌ నివేదిక ఇవ్వాలని ఆయన ఆ కమిటీలోని సభ్యులను కోరారు.  

ఆ సంస్థలో డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు చెలరేగినట్లు వినయ్ చంద్ చెప్పారు. విశాఖపట్నంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటోన్న నేపథ్యంలో తాము‌ మరోసారి జిల్లా స్థాయి సమీక్ష కూడా నిర్వహించి, చర్యలు తీసుకుంటామని వివరించారు.
 
సాల్వెంట్స్‌ సంస్థలో వాల్వ్ దగ్గర శాంపిల్ తీసుకుంటున్నప్పుడు విద్యుత్ స్పార్క్ ఏర్పడి ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. ఆ సంస్థలో అర్హతలేని వ్యక్తి‌ కెమిస్ట్‌గా పని చేస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. అవగాహన లేని వారిని సంస్థలు పనుల్లో నియమించుకుంటున్నట్లు సంబంధిత అధికారులు అంటున్నారు.

అవగాహన లేని వారిని పనుల్లో పెట్టుకోవడం వల్ల మంటలు చెలరేగిన అనంతరం కూడా నష్టం వాటిల్లిందని, వాటిని పూర్తిగా అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. సంస్థలో ప్రమాదం సంభవించిన చోట రక్షణ పరికరాలు లేవని అన్నారు.

More Telugu News