China: ఓలి ప్రభుత్వ సంక్షోభం నేపథ్యంలో.. 'నేపాల్' కమ్యూనిస్టు పార్టీతో చైనా రాయబారి చర్చలు!

  • తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఓలి ప్రయత్నాలు
  • అధికారం నుంచి దించేందుకు ప్రచండ ప్రణాళికలు
  • ఓలిపై సొంత పార్టీలోనే అసంతృప్తి
  • నేటి కార్యనిర్వాహక సమావేశం రేపటికి వాయిదా
  • రేపు తేలిపోనున్న ఓలి భవితవ్యం
Chinese envoy holds talks with NCP leader ahead of July 8 Standing Committee meet

నేపాల్‌లో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆ దేశ ప్రధానమంత్రి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేత కేపీ శర్మ ఓలి ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఓలిని అధికారం నుంచి దించేందుకు అదే పార్టీ నేత మాజీ ప్రధాని ప్రచండ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓలిపై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొనడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ప్రధానిగా ఓలిని కొనసాగించే విషయంపై మద్దతు ఇచ్చే నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ సమావేశం జరగాల్సి ఉండగా దీన్ని నేటికి వాయిదా వేశారు. అయితే, నేడు కూడా ఈ సమావేశం వాయిదా పడింది. వివాదాస్పద నిర్ణయాలతో ముందుకెళ్తున్న ఓలికి సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తోంది.

ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మాధవ్ కుమార్‌తో నేపాల్‌లోని చైనా రాయబారి హౌ యాంకీ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో నెలకొన్న వివాదాలపై హౌ యాంకీ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కాగా, చైనాలో కరోనా వ్యాప్తి, మిత్ర దేశమైన భారత్‌తో విభేదాలు పెట్టుకునేలా నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలతో ఓలిపై పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీతో పాటు, ప్రభుత్వంపై కూడా ఆధిపత్యం సాధించాలనేలా ఆయన ధోరణి ఉండడంతో ఆయనతో రాజీనామా చేయించాలని ప్రచండ ప్రణాళిక వేసుకున్నారు. కాగా, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీని ఓలీ, ప్రచండ కలిసి 2018లో  స్థాపించారు.

అనంతరం చేసుకున్న ఒప్పందం ప్రకారం వారిద్దరు రెండున్నరేళ్ల చొప్పున నేపాల్‌లో అధికారం పంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్లే మొదట ఓలి అధికారం చేపట్టారు. అయితే, 2019లో వారు మరో ఒప్పందం చేసుకుని, కార్యనిర్వాహక అధ్యక్ష హోదాలో ప్రచండ, పూర్తికాలం నేపాల్‌కు ప్రధానిగా ఓలినే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందానికి ఓలి కట్టుబడట్లేదని సొంత పార్టీలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో రేపు జరగనున్న పార్టీ కార్యనిర్వాహక భేటీలో ఓలి భవితవ్యం తేలిపోనుంది.

More Telugu News