Dexamethasone: కరోనా చికిత్సలో మరో ఔషధానికి అనుమతినిచ్చిన కేంద్రం

  • డెక్సామెథసోన్ ను వాడొచ్చన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
  • ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుందని వెల్లడి
  • బ్రిటన్ క్లినికల్ ట్రయల్స్ లో మెరుగైన ఫలితాలు
Centre gives nod for Dexamethasone in the use of corona treatment

చైనాలోని వుహాన్ లో జన్మించి, ఆపై ప్రపంచ దేశాలకు పాకిన కరోనా రక్కసి ప్రభుత్వాలను, ప్రజలను హడలెత్తిస్తోంది. ఈ వైరస్ కు నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఔషధాలను కరోన చికిత్సలో వినియోగిస్తున్నారు.

తాజాగా, భారత్ లో డెక్సామెథసోన్ అనే స్టెరాయిడ్ ను కరోనా బాధితులకు చికిత్సలో వాడేందుకు అనుమతి ఇచ్చారు. తీవ్ర వ్యాధి లక్షణాలతో బాధపడేవారిలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఇన్ ఫ్లమేషన్ (బాధతో కూడిన వాపు) స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు డెక్సామెథసోన్ వాడొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు కరోనా రోగుల చికిత్స, నిర్వహణ నియమావళిని సవరించింది. మిథైల్ ప్రెడ్నినిసోలోన్ కు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.

డెక్సామెథసోన్ ఔషధాన్ని 6 దశాబ్దాలుగా వైద్యరంగంలో వినియోగిస్తున్నారు. 1977 నుంచి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాల జాబితాలో ఉంటోంది. దీనిపై ఎవరికీ పేటెంట్ లేకపోవడంతో అన్ని దేశాల్లోనూ అందుబాటు ధరల్లోనే లభ్యమవుతోంది. ఇటీవల బ్రిటన్ లో జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో కరోనా బాధితులకు స్వస్థత కలిగించడంలో డెక్సామెథసోన్ మెరుగైన ఫలితాలను ఇచ్చింది.

More Telugu News