train: పేపర్ల‌తో రైలు నమూనాను తయారు చేసిన బాలుడు.. వీడియో వైరల్

  • వీడియోను పోస్ట్ చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ 
  • కేరళలోని త్రిస్సూర్‌లో 7వ తరగతి చదువుతున్న బాలుడు
  • మూడు రోజుల్లో పేపర్‌ ట్రైన్ తయారు
a captivating train model using newspapers

కేరళకు చెందిన ఏడో తరగతి బాలుడు న్యూస్‌ పేపర్ల‌తో తయారు చేసిన రైలు నమూనా అందరినీ అబ్బురపరుస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటోన్న  అద్వైత్‌ కృష్ణ (12) న్యూస్‌ పేపర్లతో‌ రైలును తయారు చేస్తు‍న్న వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసిందంటే బాలుడి ప్రతిభ రైల్వే అధికారులనూ ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కేరళలో త్రిస్సూర్‌లోని‌ సీఎన్‌ఎన్‌ పాఠశాలలో ఆ బాలుడు 7వ తరగతి చదువుతున్నాడని రైల్వే శాఖ తెలిపింది. పేపర్లతో‌ ఈ రైలును తయారు చేయడానికి అతడికి మూడు రోజుల సమయం పట్టిందని రైల్వే శాఖ చెప్పింది. అతడు ఇందుకోసం 33 న్యూస్‌ పేపర్లు, 10 ఎ4 షీట్లు వినియోగించాడని తెలిపింది.

రైలు ఇంజన్‌ నమూనాతో పాటు అతడు అన్ని భాగాలను ఎలా తయారు చేశాడో రైల్వే శాఖ ఈ వీడియోలో చూపించింది. ఆ బాలుడి ప్రతిభకు నెటిజన్లు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News