Mumbai: వైరస్ హాట్ స్పాట్ నుంచి... మహమ్మారిని తరిమేసిన మోడల్ గా ధారావి.. మారిపోయిందిలా!

  • ఇరుకు ఇళ్లలో దుర్భర పరిస్థితుల్లో జీవనం
  • కరోనా వ్యాపించడంతో అధికారుల వ్యూహాత్మక అడుగులు
  • ఫలించిన బృహన్ ముంబయి కృషి
  • మిగతా ప్రాంతాలకు ఇప్పుడు ఆదర్శంగా ధారావి
Dharavi is Now a Model for Fight on Corona Virus

ధారావి... ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. అంతేకాదు. అత్యంత జనసాంధ్రత కలిగిన ప్రదేశం కూడా. దాదాపు 10 లక్షల మంది ప్రజలు సుమారు 25 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో ఇరుకిరుకు ఇళ్లలో, అత్యంత దుర్బర పరిస్థితుల్లో, కలుషిత వ్యర్థాల మధ్య నివాసం గడుపుతుంటారు. ఈ ప్రాంతంలో ప్రతి 80 మందికీ ఒకే టాయిలెట్ ఉంటుంది.

అలాంటి ఈ ప్రాంతంలో కరోనా వైరస్ తొలిసారిగా బయటపడిన వేళ, మహమ్మారి ఎంత బీభత్సం సృష్టిస్తుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు. కానీ, బృహన్ ముంబయి అధికారులు చేసిన కృషి, పడిన శ్రమ ఫలితాన్ని ఇచ్చాయి. ఇక్కడ ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే కాదు... కనిష్ఠానికి చేరడంతో, ధారావి ప్రాంతం మహమ్మారిని తరిమేసిన మోడల్ గా నిలిచింది.

ధారావిలో కరోనా విజృంభిస్తే, నెల రోజుల వ్యవధిలోనే ముంబయిలో దాదాపు 5 లక్షల కేసులు వస్తాయని మార్చిలోనే అంచనా వేసిన అధికారులు, వైరస్ ప్రబలకుండా తమవంతు కృషి చేశారు. ఇక్కడ నివాసం ఉంటున్న దాదాపు 47,500 కుటుంబాల తలుపులు తట్టారు. అందరినీ పరీక్షించారు. వైరస్ సోకిన వారిని అసుపత్రులకు చేర్చడంతో పాటు, వారికి కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో వైరస్ నివారణా చర్యలు ప్రారంభించారు.

ఈ కార్యక్రమం ఏప్రిల్ లో మొదలైంది. ధారావిలో తొలి కేసు వచ్చిన తరువాత, అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు 7 లక్షల మందిని అధికారులు స్క్రీనింగ్ చేశారంటే, వారెంత సీరియస్ గా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. వైరస్ లక్షణాలు ఎవరిలో కనిపించినా, వారిని వెంటనే సమీపంలో క్వారంటైన్ సెంటర్లుగా మార్చబడిన స్కూళ్లు, స్పోర్ట్స్ క్లబ్ లకు తరలించారు. వ్యాధి బారిన పడిన వారికి చికిత్సను అందించారు.

దీంతో మే నెల ఆరంభంలో ధారావిలో వచ్చిన కేసుల సంఖ్యతో పోలిస్తే, ఇప్పుడు అదే ప్రాంతంలో వస్తున్న కేసుల సంఖ్య మూడో వంతుకు పడిపోయింది. కరోనా సోకిన వారిలో సగానికి పైగా రికవరీ అయ్యారు కూడా. దేశంలోని మిగతా ప్రాంతాల్లో వైరస్ జాడ లేని చోట కూడా కేసులు వస్తుంటే, ధారావి మాత్రం వైరస్ ను జయిస్తూ, ముందుకు సాగుతూ, మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది.

"వాస్తవానికి ఈ ప్రాంతంలో భౌతిక దూరం పాటించడం అసాధ్యం. మాకు మిగిలిన ఒకే ఒక్క అవకాశం వైరస్ ను వెంబడించడమే. అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రచించుకుని ముందుకు సాగాము" అని ముంబయి మునిసిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్, ధారావిలో కరోనాపై యుద్ధంలో ముందుండి పోరాడిన కిరణ్ దిగ్వాకర్ వెల్లడించారు. వైరస్ తొలి దశలోనే బాధితులను గుర్తించి, ఐసొలేషన్ చేయడం ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఏదిఏమైనా, ధారావి ప్రాంతం ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి బయటపడుతూ, మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

More Telugu News