Karnataka: కరోనా బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బంది.. రాళ్లతో దాడిచేసిన గ్రామస్థులు

  • కర్ణాటకలోని ఓ తండాలో ఘటన
  • దాడితో తలో దిక్కుకు పరుగులు తీసిన అధికారులు
  • పోలీసులే తమపై దాడిచేశారంటున్న గ్రామస్థులు
medical team attacked by villagers in karnataka

కరోనా బాధితులను తీసుకెళ్లేందుకు వచ్చిన ఆశా కార్యకర్తల వాహనంపై గ్రామస్థులు రాళ్ల దాడికి దిగిన ఘటన కర్ణాటకలోని కమాలపుర తాలూకా, మరమంచి గ్రామంలో జరిగింది. తండాలోని 15 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పోలీసులు అంబులెన్స్ తీసుకుని తండాకు వెళ్లారు. ముంబై నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు తండాలో సర్వే చేశారు.  

పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారంతా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని సూచించారు. ముంబై నుంచి వచ్చిన వారు అంబులెన్స్ ఎక్కాలని సూచించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాధిత బంధువులు తమలో ఎవరికీ కరోనా సోకలేదని, తాము క్వారంటైన్‌కు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. వైద్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో రాళ్ల దాడికి దిగారు.

వారి దాడి నుంచి తప్పించుకునేందుకు వైద్యులు, సిబ్బంది, పోలీసులు పరుగులు తీశారు. రాళ్ల దాడిలో పోలీసు వాహనాలు, అంబులెన్స్ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో సీఐ రాఘవేంద్ర భజంత్రి, తహసీల్దార్ అంజుమ్ తబుసుమ్‌లు తండాలో పర్యటించి గ్రామస్థులకు సర్దిచెప్పారు. పోలీసులే తమపై దాడికి దిగిననట్టు గ్రామస్థులు ఆరోపించడం ఇక్కడ కొసమెరుపు.

More Telugu News