New Delhi: ఇకపై కరోనా రోగులకు బెడ్స్ లేవంటున్న ఢిల్లీ హాస్పిటల్స్!

  • 'ఢిల్లీ కరోనా' యాప్ లో ఖాళీ బెడ్లు
  • తమ వద్ద ఖాళీలే లేవంటున్న ఆసుపత్రులు
  • యాప్ లో సమస్యలున్నాయన్న ఆప్ ఎమ్మెల్యే
No Beds for Corona Patients in Delhi

రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న వేళ, తమ ఆసుపత్రుల్లో బెడ్లన్నీ నిండుకున్నాయని, ఇకపై వచ్చే రోగులకు చికిత్స చేసేందుకు బెడ్లు లేవని న్యూఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రులు అంటున్నాయి. ఢిల్లీలో కరోనా చికిత్సలు అందిస్తున్న మ్యాక్స్ హాస్పిటల్స్, ఫోర్టిస్ హాస్పిటల్స్, హోలీ ఫ్యామిలీ హాస్పిటల్స్, తమ ఆసుపత్రులు నిండిపోయాయని అంటున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం మాత్రం బెడ్లకు కొరత లేదని అధికారిక యాప్ లో చూపిస్తుండటం గమనార్హం.

ఢిల్లీ ప్రభుత్వం కరోనాపై సమాచారాన్ని అందిస్తున్న 'ఢిల్లీ కరోనా' యాప్ లో ఫోర్టిస్ గ్రూప్ ఆసుపత్రుల్లో 32 బెడ్లు ఖాళీ ఉన్నట్టు చూపిస్తుండగా, "ప్రస్తుతం మా వద్ద ఏ బెడ్ కూడా ఖాళీగా లేదు. ఐసీయూ సైతం నిండిపోయింది. ఆ యాప్ లో ఏదో సమస్య ఉంది" అని ఆసుపత్రి ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వర్గాలు కూడా ఇదే విధమైన సమాచారాన్ని అందించాయి. యాప్ లో వివరాలు అప్ డేట్ కావడం లేదని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు.

ఇక మ్యాక్స్ ఆసుపత్రి విషయానికి వస్తే, యాప్ లో 200 బెడ్లు ఖాళీగా ఉన్నాయని చూపిస్తుండగా, తమ వద్ద ఒక్క బెడ్ కూడా లేదని స్పష్టం చేసింది. తమ నెట్ వర్క్ లోని అన్ని ఆసుపత్రులూ 100 శాతం ఆక్యుపెన్సీతో పని చేస్తున్నాయని, మొత్తం 429 బెడ్లు ఉండగా, ఒక్కటి కూడా ఖాళీ లేదని పేర్కొంది. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రం, తమ వద్ద 270 బెడ్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. యాప్ లో సమస్యలు ఉన్న విషయం వాస్తవమేనని అంగీకరించిన ఆప్ ఎమ్మెల్యే రాఘవ చద్ధా, ఒకటి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు.

More Telugu News