Meera Chopra: ఈ ప్రపంచంలో నేను ఎవరిని అభిమానించాలనేది నా ఇష్టం: మీరా చోప్రా

  • మీరా చోప్రాపై వేధింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
  • సోషల్ మీడియా దుర్భర ప్రదేశంగా మారిందని ఆవేదన
Meera Chopra responds on recent consequences

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వేధింపులు, బెదిరింపులు వస్తున్నాయంటూ నటి మీరా చోప్రా ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఓ లైవ్ చాట్ నిర్వహిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కంటే మహేశ్ బాబు అంటేనే ఇష్టం అని, జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా తెలియదని, తాను ఆయన్ ఫ్యాన్ ను కాదని మీరా చోప్రా పేర్కొన్నారు. అప్పటినుంచి ఎన్టీఆర్ అభిమానులు తనను వేధిస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరోసారి స్పందించారు.

ఈ ప్రపంచంలో ఎవరిని అభిమానించాలనేది తన ఇష్టం అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఇప్పుడొక దుర్భరమైన ప్రదేశంగా మారిపోయిందని, ఈ వివాదం మొదలయ్యాక తనకు వేధింపులు, బెదిరింపులతో కూడిన 30 వేల ట్వీట్లు వచ్చాయని వెల్లడించారు.

ఈ సైబర్ వేధింపులపై స్పందించకపోతే తప్పు చేసినట్టేనని, అందుకే హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, తాను ఢిల్లీలో నివాసం ఉంటుండడంతో అక్కడ కూడా ఫిర్యాదు చేశానని మీరా చోప్రా వివరించారు. హీరోలు తమ అభిమానుల గ్రూప్ ల గురించి తెలుసుకోవాలని, ఇలాంటి ధోరణులను ఖండించాలని అన్నారు. హీరోలు చెబితే ఫ్యాన్స్ కచ్చితంగా వింటారని మీరా అభిప్రాయపడ్డారు.

More Telugu News