Telangana: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 8 నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!

  • ఆర్టీసీ ఉన్నతాధికారులతో రవాణా మంత్రి పువ్వాడ సమీక్ష
  • సొంతవాహనాలతో రద్దీగా మారుతున్న రోడ్లు
  • ఉద్యోగుల ఇబ్బందుల నేపథ్యంలో బస్సులు నడపాలని నిర్ణయం
TSRTC Buses will run from 8th june

దాదాపు రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన హైదరాబాద్ సిటీ బస్సులు మరో ఐదు రోజులలో రోడ్డెక్కనున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సిటీ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది.

ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకున్నాయి. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే, ప్రజా రవాణా సంస్థ అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలో రోజుకు దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తుంటారు. దాదాపు అన్ని కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ బస్సులు లేకపోవడంతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది.

మరోవైపు, షేర్ ఆటోలున్నా కరోనా భయంతో వాటిపై ఎవరూ పెద్దగా అటువైపు ఆసక్తి చూపడం లేదు. సొంతవాహనాలు ఉన్న వారు వాటిపైనే కార్యాలయాలకు వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నెల 8 నుంచి సిటీ బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News