India: ఇండియా బోర్డర్ కానీ, దక్షిణ చైనా సముద్రం కానీ... చైనా తీరు దారుణంగా ఉంది: అమెరికా తీవ్ర వ్యాఖ్యలు

  • భారత భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చిన తరుణంలో అమెరికా కీలక వ్యాఖ్యలు
  • చైనా తీరు అభ్యంతరకరమని వ్యాఖ్య
  • రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని విమర్శ
America criticises China for boarder disputes with India

చైనాపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఇండియా బోర్డర్ కానీ, దక్షిణ చైనా సముద్రం కానీ... ఆయా ప్రాంతాల్లో చైనా వ్యవహరిస్తున్న తీరు కలవరపరుస్తోందని విమర్శించింది. ఇండియా భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చిన ఘటనల నేపథ్యంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఈ వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టేలా చైనా ప్రవర్తిస్తోందని అన్నారు. తన శక్తిని చైనా ఏ విధంగా చూపించాలనుకుంటోందని ప్రశ్నించారు.

చైనా తీరు అభ్యంతరకరమని... అందువల్లే తాము తమలాంటి భావజాలం కలిగిన ఆసియన్ దేశాలతో కలిసి నడుస్తున్నామని చెప్పారు. అమెరికా, జపాన్, ఇండియాతో కూడిన త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశామని... ఇదే విధంగా నాలుగు దేశాల కూటమిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో లఢఖ్, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో చైనా, ఇండియా సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఇదే సమయంలో తూర్పు లఢఖ్ లోకి చైనా హెలికాప్టర్లు కూడా చొచ్చుకొచ్చాయి. అయితే వీటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. ఆ సమయంలో భారత్ సుఖోయ్-30 విమానాలను మోహరించింది.

మరోవైపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో కూడా చైనా కుతంత్రాలకు పాల్పడుతోంది. ఆ ప్రాంతంలోని ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాం తదితర దేశాలతో తగువు పెట్టుకుంటోంది. గత రెండేళ్ల కాలంలో అమెరికాతో చైనాకు ఉన్న బంధాలు చాలా బలహీనమయ్యాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో తీవ్రంగా విమర్శించారు.

More Telugu News