Corona Virus: కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదు.. తేల్చేసిన బ్రిటన్, ఇటలీ ప్రధానులు

  • మహమ్మారి వైరస్‌తో కలిసి జీవించాల్సిందే
  • మొండిగా ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు
  • టీకా అందుబాటులోకి వచ్చేంత వరకు వేచి చూడలేం
No Corona Virus vaccine in near future

కరోనాకు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశలపై బ్రిటన్, ఇటలీ ప్రధానులు నీళ్లు చల్లారు. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకా ఇప్పట్లో రాకపోవచ్చని ఇటలీ ప్రధాని గిసెప్పీ కొంటె, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

సమీప భవిష్యత్తులో టీకా వచ్చే అవకాశమే లేదని, వైరస్‌తో కలిసి ముందుకు సాగాల్సిందేనని వారు పేర్కొన్నారు. మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో తిరిగి దానిని పట్టాలెక్కించేందుకు లాక్‌డౌన్‌లు ఎత్తివేసి, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని వారు వ్యాఖ్యానించారు.

ఇటలీలో షెడ్యూలు కంటే ముందుగా అంటే, నేటి నుంచే అక్కడ రెస్టారెంట్లు, బార్లు, బీచ్‌లు తెరుచుకోనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మొండిగా ముందడుగు వేయడం తప్ప మరో మార్గం లేదని ఇటలీ ప్రధాని గెసెప్పీ అన్నారు. టీకా అందుబాటులోకి వచ్చేంత వరకు వేచి చూడలేమని అన్నారు. మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్న వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కరోనా టీకా ఎప్పటికీ అందుబాటులోకి రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అందుబాటులోకి వచ్చినా చాలా సమయం పడుతుందని అన్నారు. వైరస్‌తో కలిసి జీవించాలన్న వాస్తవాన్ని గ్రహించాలని బోరిస్ వివరించారు.

More Telugu News