Fathima: అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఫాతిమాకు నిర్బంధ పదవీ విరమణ ఆదేశం!

  • 2018లో శబరిమలకు వెళ్లిన ఫాతిమా
  • శాఖా పరమైన విచారణ జరిపించిన సంస్థ
  • ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన ఫాతిమా
BSNL Orders Fathima to Compulsary Retirement

కేరళలో బీఎస్ఎన్ఎల్ సంస్థలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న మహిళా యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా పేరు గుర్తుందా? 2018లో శబరిమల అయ్యప్పను మహిళలు కూడా దర్శించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళల్లో ఆమె ఒకరు.

అంతేకాదు, తన ఫేస్ బుక్ పేజీలో ఈ విషయంపై ఆమె మతపరమైన అంశాలను ప్రస్తావించి వివాదానికి కారణమైంది. ఆ సమయంలో ఆమె ఇంటిపై రాళ్లదాడి కూడా జరిగింది. సొంత ఇంట్లోని వారే ఆమెను వెలేశారు. తాజాగా ఈ విషయంలో ఇప్పుడామెపై బీఎస్ఎన్ఎల్ సంస్థ నిర్బంధ పదవీ విరమణ ఆదేశాలు జారీ చేసింది.

ఆమెపై శాఖా పరమైన విచారణ జరిపిన అనంతరం ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తనపై నమోదైన కేసుల్లో చార్జ్ షీట్ ఇంకా దాఖలు కాలేదని, కేసు విచారణలో ఉండగా, ఇలా నిర్బంధ పదవీవిరమణ చేయిస్తూ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తూ,  సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ లో ఆమె ఓ పిటిషన్ దాఖలు చేశారు

More Telugu News