Arnab Goswami: ఎడిటర్స్ గిల్డ్ కు అర్నాబ్ గోస్వామి రాజీనామా... టీవీ లైవ్ లో సంచలన ప్రకటన!

  • సంపాదకీయ నీతి చచ్చిపోయింది
  • శేఖర్ గుప్తా వంటి వారే ఇందుకు కారణం
  • జర్నలిస్టులు మౌనం వహించారు
  • నిరసనగా రాజీనామా చేస్తున్నానన్న అర్నాబ్
Arnab goswami Resigns from Editors Guild of India

రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు, ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు రాజీనామా చేశారు. టీవీ చానెల్ లైవ్ లో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇండియాలో సంపాదకీయ విలువలు దిగజారాయని, నీతి చచ్చిపోయిందని ఆయన ఆరోపించారు. శేఖర్ గుప్తా వంటి వారి కారణంగానే జర్నలిజం చచ్చిపోయిందని విమర్శించారు.  

"నేను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో సుదీర్ఘకాలంగా సభ్యుడిగా ఉన్నాను. నేను ఇప్పుడు టీవీ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను. సంపాదకీయ నీతిని పాటించే విషయంలో మీడియా సంపూర్ణంగా రాజీ పడినందున నేను రాజీనామా చేస్తున్నాను. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ విషయంలో శేఖర్ గుప్తా... నిన్నే నిందితుడిగా చేస్తున్నాను. ఈ తరహా ఘటనలపై (మహారాష్ట్రలోని పాల్ ఘర్ సంఘటన: గుజరాత్ లోని సూరత్ లో మరణించిన తమ గురువు అంత్యక్రియలకు హాజరవడానికి మహారాష్ట్ర నుంచి వెళుతున్న ఇద్దరు సాధువులు, కారు డ్రైవరు పాల్ ఘర్ జిల్లాలో మూక దాడిలో మరణించిన వైనం) జర్నలిస్టులు మాట్లాడటం లేదు" అని అన్నారు.

ప్రైమ్ టైమ్ న్యూస్ డిబేట్ లో పలువురు ప్రముఖులతో కలిసి మాట్లాడిన అర్నాబ్, "నేను డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన నసీరుద్దీన్ షా నుంచి అపర్ణా సేన్, రామచంద్ర గుహ, సిద్ధార్ద్ వరదరాజన్ వంటి 'అవార్డు వాపసీ గ్యాంగ్' ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు" అని వ్యాఖ్యానించారు.

 ఆపై "శేఖర్ గుప్తా... ముందు నేను చెప్పేది విను. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై నమ్మకం చచ్చిపోయింది. ఎన్నో ఫేక్ న్యూస్ లపై మౌనంగా ఉంటున్నారు" అని అర్నాబ్ గోస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు.

More Telugu News