Bill Gates: ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించిన బిల్ గేట్స్

  • డబ్ల్యూహెచ్ఓకు మరో 150 మిలియన్ డాలర్లను ప్రకటించిన గేట్స్ ఫౌండేషన్
  • మొత్తం 250 మిలియన్ డాలర్లకు చేరిన విరాళాలు
  • కరోనాను డబ్ల్యూహెచ్ఓ ఎదుర్కోగలదని మిలిందా గేట్స్ వ్యాఖ్య
Bill Gates announces another 150 mn dollors to WHO

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సేవలు ఇప్పుడు మరింత అవసరమని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ బలంగా ఉంటేనే ప్రపంచానికి మంచిదని చెప్పారు. ఆ సంస్థకు నిధులను నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను కూడా ఆయన తప్పుపట్టారు.

 ఈ నేపథ్యంలో, బిల్ గేట్స్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున మరో 150 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. తాజా విరాళంతో గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం 250 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఈ సందర్భంగా బిల్ గేట్స్ భార్య మిలిందా గేట్స్ మాట్లాడుతూ, కరోనా వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎదుర్కోగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థకు అమెరికా ఆర్థిక సాయాన్ని ఉపసంహరించుకోవడం ప్రమాదకరమని చెప్పారు. సంక్షోభ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ చేతులు కలపాలని అన్నారు. అమెరికా మొండి చేయి చూపడం వల్ల ఏర్పడిన లోటును ఇతరులు తీర్చడం కష్టమేనని చెప్పారు.

More Telugu News