Equador: ఈక్వెడార్‌లో దారుణ పరిస్థితులు.. చెల్లాచెదరుగా మృతదేహాలు

  • ఫుట్‌పాత్‌లు, రోడ్లపైన మృతదేహాలు
  • తిండిలేక భిక్షాటనకు వెళ్లి వైరస్ అంటించుకుంటున్న ప్రజలు
  • భౌతిక దూరం గాలికొదిలేయడంతో సమస్య తీవ్రం
Worse conditions in Ecuador

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఈక్వెడార్‌ను మరింత దారుణ పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్కడి పరిస్థితులు చూసిన వారి హృదయాలు తరుక్కుపోతున్నాయి. నిర్లక్ష్యం, భౌతిక దూరాన్ని గాలికి వదిలేయడం, సామాజిక, ఆర్థిక అసమానతలు ఆ దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేశాయి. ఫలితంగా మృతదేహాలు రోడ్లపైనా, ఫుట్‌పాత్‌లపైనా దర్శనమిస్తున్నాయి. శవపేటికలు కూడా దొరకని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.

 ఈక్వెడార్, స్పెయిన్ దేశాల మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఈక్వెడార్ వాసులు ఎక్కువగా స్పెయిన్, ఇటలీలకు వలస వెళ్తుంటారు. ఇప్పుడదే వారి కొంప ముంచింది. స్పెయిన్, ఇటలీ దేశాలు కరోనాకు కేంద్రంగా మారిన నేపథ్యంలో అక్కడనున్న ఈక్వెడార్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓవైపు వైరస్ విజృంభిస్తుంటే మరోవైపు ఈక్వెడార్‌లోని సంపన్నుల ఇంట్లో పెళ్లిళ్లు జరగడం, వందలాదిమంది హాజరు కావడంతో వైరస్ ఒక్కసారి విస్తరించింది. మురికివాడలకు కూడా పాకింది.

వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కఠిన ఆంక్షలు విధించిన ఈక్వెడార్ ప్రభుత్వం ప్రజలు ఇళ్లలోనే వుండాలని, నెలకు 60 డాలర్ల చొప్పున ఇస్తామని ప్రకటించింది. అయితే, పూటగడవని పేదలు కడుపు నింపుకునే మార్గం లేక పనులకు వెళ్లి వైరస్ బారినపడి తనువు చాలిస్తున్నారు. మరికొందరు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ వైరస్‌ను అంటించుకుంటున్నారు. ఇక, ఈక్వెడార్‌లో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 70 శాతానికి పైగా గ్వాయస్ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. ఇక్కడ అధికారులు చెబుతున్న దానికి కొన్ని రెట్లు అధికంగా మరణాల సంఖ్య ఉంటుందని చెబుతున్నారు.

More Telugu News