IsoProphyle Alchohal: మద్యం దొరక్క... ఐసోప్రొపైల్ ఆల్కహాల్ తాగిన స్నేహితులు.. ఒకరి మృతి!

  • తణుకు సమీపంలో ఘటన
  • మందు వాసన రావడంతో తాగేసిన స్నేహితులు
  • ఆసుపత్రిలో చికిత్స.. ఇద్దరి పరిస్థితి విషమం
Youth Died after Drink Isoprophyle Alchohal

కరోనా మహమ్మారి వ్యాప్తి భయంతో లాక్‌ డౌన్‌ విధించిన నేపథ్యంలో వైన్‌ షాపులు బంద్‌ కావడం మద్యానికి బానిసలుగా మారిన ఆరుగురు స్నేహితులకు చిక్కులు తెచ్చి పెట్టింది. శానిటైజర్ తయారీకి ఉపయోగించే ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఘాటైన మద్యం వాసన వస్తుండటంతో, దాన్ని శీతల పానీయంలో కలుపుకుని తాగారు. ఈ ఘటన తణుకు సమీపంలోని వేల్పూరు గ్రామంలో జరిగింది.

ఎక్సయిజ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ధర్నాల నవీన్‌ మూర్తిరాజు (22)కు అల్లాడి వెంకటేష్, పండూరి వీరేష్, తణుకు దుర్గారావు, విప్పర్తి శ్యామ్ సుందర్, కావలిపురపు వెంకటదుర్గాప్రసాద్‌ స్నేహితులు. మద్యం షాపులు మూతపడిన తరువాత వీరందరూ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. వీరిలో వీరేశ్ పైడిపర్రులో ఉన్న అంబికా కెమికల్స్‌ లో పని చేస్తున్నాడు. ఆదివారం ఏలూరు నుంచి కెమికల్స్ రాగా, లోడ్ దించడానికి వీరేష్‌ ను పిలిచారు. లోడ్‌ దించిన తరువాత, శానిటైజర్‌ తయారీకి ఉపకరించే ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ ను 400 మిల్లీలీటర్లు బాటిల్‌ లో వీరేష్‌ తీసుకెళ్లాడు.

ఆపై తన స్నేహితులకు కాల్ చేసి, శానిటైజర్‌ తయారు చేద్దామని పిలిపించాడు. అందరూ కావలిపురం చెరువు దగ్గర కలుసుకున్నారు. అప్పటికే మద్యం దొరక్క అవస్థలు పడుతున్న వీరు, వీరేష్ తెచ్చిన రసాయనం మందు వాసన వస్తుండటంతో, శీతల పానీయంలో కలుపుకుని తాగేశారు. నవీన్‌బాబు, వెంకటేష్, వీరేష్‌ ఎక్కువ మోతాదులో తాగగా, మిగతా ముగ్గురూ తక్కువ తాగారు.

అందరూ ఇంటికి వెళ్లిపోయాక, నవీన్‌ మూర్తి రాజు పరిస్థితి విషమించింది. తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు మిగల్లేదు. ప్రస్తుతం వెంకటేష్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. వీరేష్‌ పరిస్థితి కూడా విషమంగా ఉంది. బాధితుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు దర్యాపు ప్రారంభించారు. చికిత్స పొందుతున్న మిగతా ముగ్గురి నుంచి వివరాలు సేకరించారు.

More Telugu News