New Delhi: పోలీసుల అధీనంలోకి హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతం!

  • ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్థనలు
  • వచ్చిన వారి వివరాలు వెల్లడించడంలో విఫలం
  • కేజ్రీవాల్ ఆదేశాల మేరకు కేసు నమోదు
Police Action in New Delhi Hazrat Nizamuddeen

ఢిల్లీలోని వెస్ట్ నిజాముద్దీన్ ప్రాంతం ఇప్పుడు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారే కరోనా వ్యాప్తికి కారణం అయ్యారన్న కారణంగా మర్కజ్ మౌలానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. మర్కజ్ కు వచ్చిన వారి వివరాలను వెల్లడించాలని కోరినా, ఆయన వెల్లడించలేదని ఆరోపించారు.

ఈ ప్రార్థనలకు వచ్చిన వారే, కరోనా వైరస్ ను అంటించుకుని, తమతమ ప్రాంతాలకు వెళ్లారని, దేశంలో నమోదైన కాంటాక్ట్ కేసులన్నీ వీరి నుంచి వ్యాపించినవేనని తేలడంతో కేజ్రీవాల్ ఆదేశాల మేరకు, ఢిల్లీ జాయింట్ సీపీ డీసీ శ్రీవాత్సవ నేతృత్వంలోని టీమ్, నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి, ఆ ప్రాంతంలోని దాదాపు 1200 మందిని క్వారంటైన్ చేసింది. మర్కజ్ మౌలానాపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలోని పలు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రజల కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచారు. ఈ ప్రాంతానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీమ్ కూడా వచ్చి, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను ప్రారంభించింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మొత్తం హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతాన్ని రసాయన ద్రావణాలతో శుభ్రం చేస్తున్నారని, ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

మత ప్రార్థనలు జరిగిన ప్రాంతంలోని రెండు కాలనీల్లో హౌస్ - టూ - హౌస్ మ్యాపింగ్ చేస్తూ, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. మొత్తం పరిస్థితిపై ఓ ప్రకటన విడుదల చేసిన ఢిల్లీ ప్రభుత్వం "మార్చి 24 నుంచి ఢిల్లీ అంతటా లాక్ డౌన్ విధించాం. ప్రతి ఇంటి యజమాని, హాస్టల్ అడ్మినిస్ట్రేటర్, గెస్ట్ హౌస్, లాడ్జిలు తదితరాలన్నింటి చోటా సామాజిక దూరాన్ని పాటించాలి. కానీ ఈ ప్రాంతంలో క్వారంటైన్ ప్రొటోకాల్స్ లో అత్యంత ముఖ్యమైన సోషల్ డిస్టెన్స్ ను పాటించడం లేదు" అని పేర్కొంది. నిబంధనలను పాటించనందుకే కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఈ ప్రాంతంలో అధికంగా ఉందని ఢిల్లీ సర్కారు వెల్లడించింది.

కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కేజ్రీవాల్ సర్కారు సూచించింది. తొలి పాజిటివ్ కేసు రాగానే, నిజాముద్దీన్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని తెలిపింది.

కాగా, ప్రభుత్వం అడిగినట్లుగా తాము ప్రార్థనలకు వచ్చిన వారి జాబితాను అందించామని నిజాముద్దీన్ మర్కజ్ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ షోయబ్ వెల్లడించడం గమనార్హం. ఆదివారం నాడు ఈ జాబితాను తాము అధికారులకు ఇచ్చామని, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రులకు తరలించామని, వారి ట్రావెల్ హిస్టరీని కూడా అందించామని స్పష్టం చేశారు.

More Telugu News