Corona Virus: ఢిల్లీలో మరొకరికి కరోనా నిర్ధారణ.. దేశంలో 31కి చేరిన బాధితులు

  • ఉత్త‌మ్ న‌గ‌ర్‌కు చెందిన వ్య‌క్తికి క‌రోనా 
  • ఇటీవలే థాయిలాండ్‌, మ‌లేషియాల్లో అతడి పర్యటన
  • దేశంలో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న వారు 28,529 
One more corona case confirmed

ఢిల్లీలోని ఉత్త‌మ్ న‌గ‌ర్‌కు చెందిన మరో వ్య‌క్తికి క‌రోనా వైరస్‌ సోకిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్య‌ద‌ర్శి సంజీవ కుమార్ ప్రకటించారు. దీంతో భారత్‌లో కరోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 31కి చేరుకుంది. ఉత్తమ్‌ నగర్‌లో కరోనా బాధితుడిగా మారిన వ్యక్తి ఇటీవల థాయిలాండ్‌, మ‌లేషియాల్లో పర్యటించారని అధికారులు తెలిపారు.

కాగా, కరోనా గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నిన్న అధికారికంగా ప్రకటన చేసి దేశంలో మొత్తం కోవిడ్-19 కేసులు 29కి చేరినట్టు వివరించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న మొత్తం 28,529 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయన తెలిపారు. కేరళకు చెందిన ముగ్గురు కోలుకున్నారని వివరించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులపై ప్రత్యేక దృష్టి సారించి స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  

More Telugu News