whats app: కరోనా విజృంభణ నేపథ్యంలో.. వాట్సప్‌లో విపరీతంగా ప్రచారమవుతున్న నకిలీ వార్త!

  • ‘యునిసెఫ్‌’ పలు సూచనలు చేసిందంటూ ఓ నకిలీ సందేశం
  • సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌
  • కరోనా వైరస్‌ కణాల సైజు చాలా పెద్దవని ప్రచారం
  • ఏ మాస్క్‌ అయినా వినియోగించవచ్చని ‘యునిసెఫ్‌’ పేర్కొన్నట్లు మెసేజ్‌
whats app msg about corona virus

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నకిలీ వార్తలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఇటువంటి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థల పేరుతో కొందరు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారు. ఇదంతా అసత్య ప్రచారమేనని తెలుసుకోలేకపోతున్న నెటిజన్లు వాటిని షేర్‌ చేస్తున్నారు.

ఇటీవల ‘యునిసెఫ్‌’ పలు సూచనలు చేసిందంటూ ఓ సందేశం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. కరోనా వైరస్‌ కణాల సైజు చాలా పెద్దవని, సుమారు 400-500 మైక్రో సైజులో ఉంటాయని, కాబట్టి ప్రత్యేకంగా తయారు చేసిన మాస్కులు మాత్రమే ధరించే అవసరం లేదని, ఏ మాస్క్‌ అయినా వినియోగించవచ్చని ‘యునిసెఫ్‌’ పేర్కొన్నట్లు వాట్సప్‌ లో ఓ మెసేజ్‌ హల్‌చల్ చేస్తోంది.

అయితే, ఇటువంటి సూచనలు యునిసెఫ్‌ చేయలేదు. ఎందుకంటే, కరోనా వ్యాపించకుండా మాస్కులు ఉపయోగపడతాయన్న సూచనలేవీ ఇప్పటివరకు డబ్ల్యూహెచ్‌వో చేయలేదు. కరోనా సోకిన వ్యక్తికి సపర్యలు చేసే వ్యక్తి మాత్రమే మాస్కులు ధరించాల్సి ఉంటుందని మాత్రమే డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.

కరోనాపై విపరీతంగా వైరల్‌ అవుతోన్న 'అసత్య వార్త' ఇదే..

-కరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు.

- ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.

- కరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.

- కరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

- ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.  

- ఈ వైరస్ గనుక 26-27 ° C లో ఉంటే చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బతకలేదు. కాబట్టి, వేడి నీళ్లు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.

- కొన్నాళ్లు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

-గోరు వెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.

- కొన్ని రోజుల పాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.
( UNICEF సౌజన్యంతో)

ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం... నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..

More Telugu News