ఈ నెలాఖరుకి 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి: ఏపీ సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నాటికి 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని ఏపీ సీఎం జగన్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మహిళలకు భద్రత కరవైందని, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకే ‘దిశ’ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అడుగులోనూ మహిళలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పదమూడు జిల్లాల ఏపీలో పద్దెనిమిది దిశ మహిళా పోలీస్ స్టేషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటం గర్వకారణంగా ఉందని, డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిబ్బంది పని చేస్తారని చెప్పారు.

విశాఖ, తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్ ల కోసం రూ.31 కోట్లు విడుదల చేశామని, పదమూడు జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు లభించాయని చెప్పారు. చట్టం ప్రకారమే న్యాయం జరగాలని, నేరం ఎలాంటి వారు చేసినా 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడాలన్న ఉద్దేశంతో దిశ చట్టం తీసుకొచ్చామని జగన్ చెప్పారు. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం కలగాలని, ఉరిశిక్ష అమలు చేయడానికి అనువుగా ఈ చట్టం తీసుకొచ్చామని వివరించారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Disha police station
Rajahmundry

More Telugu News