దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందట!: నిర్మలా సీతారామన్ కు చురకంటించిన చిదంబరం
- 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన చిదంబరం
- దేశ ఆర్థిక వ్యవస్థను కేవలం ఆరు నెలల్లోనే నాశనం చేశారు
- ఈ సమస్యపై కేంద్ర మంత్రుల వద్ద ఎటువంటి పరిష్కార మార్గాలు లేవు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని చిదంబరం మాట్లాడారు. 'దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే నాశనం చేసేసింది. ఈ సమస్యపై కేంద్ర మంత్రుల వద్ద ఎటువంటి పరిష్కార మార్గాలు లేవు' అని వ్యాఖ్యానించారు.
'నిన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా బాగానే ఉందని అన్నారు. అచ్చేదిన్ త్వరలోనే వస్తుందన్న వ్యాఖ్యను మాత్రమే ఆమె చేయలేదు. మిగతా అన్ని విషయాలను చెప్పారు' అని చిదంబరం చురకలంటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతున్నప్పటికీ బీజేపీ నేతలు అంతా బాగానే ఉందని చెబుతున్నారని విమర్శించారు.