నరేంద్ర మోదీజీ! ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో సవరణలు తేవాలి: మంత్రి కేటీఆర్

  • అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలి
  • ఆ శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదు
  • పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం లేవనెత్తాలని విజ్ఞప్తి
వెటర్నరీ డాక్టరు అత్యాచారం, హత్య ఘటనపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల్లో మార్పు తీసుకురావాలని కోరుతూ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి వరుస ట్వీట్లు చేశారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో మార్పులు తేవాలని, అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని, ఆ శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్భయపై అత్యాచార ఘటన గురించి ప్రస్తావించారు. ఈ ఘటన జరిగి ఏడేళ్లయినా నిందితులకు ఉరిశిక్ష పడలేదని అన్నారు.ఇటీవల తొమ్మిది నెలల పాపపై అత్యాచారానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధించాలని దిగువ కోర్టు తీర్పిస్తే, ఆ శిక్షను హైకోర్టు తగ్గిస్తూ జీవితఖైదుగా మార్చిన విషయాన్ని ప్రస్తావించారు.

ఇప్పుడు హైదరాబాద్ లో ఓ వెటర్నరీ డాక్టర్ ను అత్యాచారం చేసి, హత్య చేశారని, హంతకులు దొరికారు కానీ, బాధితురాలికి న్యాయం ఎలా చేద్దామని ప్రశ్నించారు. న్యాయం జరగడంలో ఆలస్యమైందంటే న్యాయం జరగనట్టే అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక, ఈ అంశాన్ని లేవనెత్తి దీనిపై ఓ రోజు మొత్తం చర్చించి, ఐపీసీ, సీఆర్పీసీలో సవరణలు తీసుకురావాలని కోరారు. బాధపడుతున్న, నిస్సహాయంగా వున్న పౌరుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానంటూ మోదీకి చేసిన ట్వీట్లలో కేటీఆర్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Telangana
ktr
Prime Minister
Narendra Modi

More Telugu News