Uttar Pradesh: యూపీలో దారుణం.. జర్నలిస్టును అడ్డగించి గొంతు కోసి దారుణ హత్య

  • ఖుషీనగర్‌లోని దుబౌలీ గ్రామంలో ఘటన
  • బైక్‌పై వెళ్తుండగా అడ్డగించిన దుండగుడు
  • నిందితుడి కోసం పోలీసుల వేట
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ జర్నలిస్టును అడ్డగించిన దుండగుడు అతడి గొంతు కోసి హత్య చేశాడు. ఖుషీనగర్ జిల్లాలోని దుబౌలీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక హిందీ దినపత్రికలో పనిచేసే రాధేశ్యామ్ శర్మ (55) గురువారం బైక్‌పై దుబౌలీ గ్రామం మీదుగా వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు అతడిని అడ్డగించాడు. ఆపై గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాధేశ్యామ్ పార్ట్‌టైమ్‌ జర్నలిస్టుగానూ పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాధేశ్యామ్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Uttar Pradesh
journalist
murder

More Telugu News