అక్రమ బ్యానర్లు తొలగించాలని ఇంజనీర్ ఆదేశం.. వెంటపడిమరీ కొట్టిన ఎండీఎంకే కార్యకర్తలు!

  • తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన
  • వైఎంసీఏ స్టేడియం వద్ద అక్రమ బ్యానర్లు
  • తొలగించాలని ఆదేశించిన ప్రభుత్వ ఇంజనీర్
తమిళనాడు రాజధాని చెన్నైలో శుభశ్రీ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఓ బ్యానర్ మీద పడిన కారణంగా ప్రమాదం జరిగి, ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అక్రమ బ్యానర్లను హైకోర్టు ఆదేశాలతో తొలగిస్తున్న సిబ్బందిపై ఎండీఎంకే కార్యకర్తలు దాడికి దిగారు. అక్రమ బ్యానర్లను వెంటనే తొలగించాలని శుభశ్రీ ఘటన తర్వాత మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైఎంసీఏ స్టేడియం వద్ద అక్రమ బ్యానర్లు వెలిశాయని కొందరు స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నగరంలోని వైఎంసీఏ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన బ్యానర్లు, ప్లెక్సీలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఎండీఎంకే కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. ‘మా నాయకుడిని స్వాగతించడానికి పెట్టిన బ్యానర్లనే తొలగిస్తావా?’ అంటూ చితకబాదారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ దాడికి పాల్పడిన ఎండీఎంకే కార్యకర్తల నుంచి ఇంజనీర్ ను కాపాడిన పోలీసులు కారులో తరలించారు. ఎండీఎంకే పార్టీకి వైగో నేతృత్వం వహిస్తున్నారు.
Go Back to Shorts
Tamilnadu
Chennai
Illegal banners
MDMK workers
Attacked
Government Engineer

More Telugu News