Narendra Modi: మోదీ సహా 51 మంది మంత్రులు కోటీశ్వరులే.. హర్‌సిమ్రత్ అందరికంటే ధనవంతురాలు!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కొలువుదీరిన కేంద్ర కేబినెట్‌లోని 56 మంది మంత్రుల్లో 51 మంది మంత్రులు కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. ప్రధాని మోదీ సహా అందరూ కోట్లకు పడగలెత్తిన వారేనని తేల్చిచెప్పింది. వీరిందరిలోనూ పంజాబ్‌కు చెందిన అకాలీదళ్ ఎంపీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మరింత ధనవంతురాలని పేర్కొంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ 217 కోట్ల రూపాయలని తేల్చింది.

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రూ.95 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. రూ.42 కోట్లతో స్వతంత్ర మంత్రి రావ్ ఇందర్‌జిత్ మూడో స్థానంలో నిలవగా రూ.2 కోట్ల ఆస్తితో ప్రధాని నరేంద్రమోదీ 46వ స్థానంలో ఉన్నట్టు ఏడీఆర్ పేర్కొంది. మోదీ కంటే తక్కువ ఆస్తి కలిగిన మంత్రులు పదిమంది ఉన్నారు. అర్జున్ రామ్ మేఘ్‌వాల్, నరేంద్ర సింగ్ తోమర్‌ల ఆస్తి కూడా రెండు కోట్ల రూపాయల లోపు కాగా, సంజీవ్ కుమార్ బాల్యన్, కిరణ్ రిజిజు, సాధ్వి నిరంజన్ జ్యోతిల ఆస్తి దాదాపు కోటి రూపాయలు.

కోటీశ్వరులు కానీ మంత్రులు ఐదుగురు ఉన్నారు. దేవశ్రీ చౌధురి ఆస్తి రూ.61 లక్షలు కాగా, రామేశ్వర్ తేలి ఆస్తి రూ.43 లక్షలు. ఆ తర్వాతి స్థానాల్లో వి.మురళీధరన్ (రూ.27 లక్షలు), కైలాశ్ చౌధురీ (రూ.24 లక్షలు), ప్రతాప్ చంద్ర సారంగి (రూ.13 లక్షలు) ఉన్నట్టు ఏడీఆర్ వివరించింది.
Go Back to Shorts
Narendra Modi
Union ministers
crorepati
Harsimrat Kaur Badal
BJP

More Telugu News