మోదీ... మీ ఖర్మ కాలే సమయం వచ్చింది: రాహుల్ గాంధీ

  • రాజీవ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోదీ
  • ఖర్మ ఫలం ఎదురుచూస్తోందన్న రాహుల్
  • ట్విట్టర్ వేదికగా మండిపాటు
రాజీవ్ గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగుతుండగా, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన రాహుల్, "మోదీ జీ... పోరు ముగిసింది. మీ ఖర్మ ఫలం ఎదురుచూస్తోంది. మీలోఉన్న నమ్మకం చెదిరిపోతుంది. నా తండ్రిపై చేసే విమర్శలూ మిమ్మల్ని కాపాడలేవు. మీపై ప్రేమతో ఓ కౌగిలింత... రాహుల్" అని ట్వీట్ చేశారు.

ఇక మోదీ వ్యాఖ్యలపై చిదంబరం స్పందిస్తూ, అసలు మోదీకి ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమేనని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి ఆయనకు తెలియకపోయిందని అన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో లంచం తీసుకున్నట్టు రాజీవ్ పై ఎటువంటి సాక్ష్యాధారాలూ లభించలేదని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రజా జీవితంలో ఉండి మరణించిన రాజీవ్ గాంధీని విమర్శించడం ద్వారా మోదీ తన అన్ని అవధులనూ దాటేశారని చిదంబరం మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.



Go Back to Shorts
Rajiv Gandhi
Rahul Gandhi
Narendra Modi
Priyaanka Gandhi
Chidambaram

More Telugu News