బీజేపీ నాయకురాలు జయప్రదకు వై ప్లస్‌ కేటగిరి భద్రత

  • ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు
  • అజంఘడ్‌లో ఎస్పీ అభ్యర్థిపై పోటీ చేస్తున్న అందాల నటి
  • 17 మంది పోలీసులను కేటాయించిన అధికారులు
అలనాటి అందాలనటి, ప్రస్తుతం బీజేపీ నాయకురాలు జయప్రదకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వై ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అజంఖాన్‌తో జయప్రద పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఆమె భద్రతకు ముప్పుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు శాఖ ఆమె భద్రత కోసం 17 మంది సిబ్బందిని కేటాయించింది.

వీరిలో ఐదుగురిని జయప్రద ఇంటి వద్ద కాపలాగా ఉంచుతామని, మిగిలిన వారు షిప్టుల వారీగా ఆమెకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తారని ఉత్తరప్రదేశ్‌ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అరవిందకుమార్‌ తెలిపారు. అలాగే ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌పై అజంఘడ్‌లో పోటీ పడుతున్న జానపద గాయకుడు దినేష్‌లాల్‌ యాదవ్‌కు కూడా పోలీసులు వై ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించారు.

రాజకీయ నాయకులు, అధికారులు, ఇతరులకు ఉన్న ముప్పు స్థాయిని బట్టి పోలీసులు ఐదు రకాల భద్రత కల్పిస్తారు. ఎక్స్‌, వై, వై ప్లస్‌, జెడ్‌, జెడ్‌ ప్లస్‌ ముఖ్యమైనవి. జెడ్‌ ప్లస్‌ అన్నిటి కంటే ఎక్కువ స్థాయి భద్రత.
Go Back to Shorts
Uttar Pradesh
jayaprada
Y+ category security

More Telugu News