ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఫిబ్రవరి 6 నుంచి బస్సులు బంద్!
- సమ్మెలో పాల్గొననున్న 52 వేల మంది
- నిర్ణయం తీసుకున్న కార్మిక సంఘాల ఐకాస
- 15-20 శాతం ఫిట్ మెంట్ కోరుతున్న సిబ్బంది
ఆర్టీసీలో 2017, ఏప్రిల్ 1న దాదాపు 52 వేల మంది సిబ్బందికి వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే దీన్ని జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం చివరికి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒత్తిడితో 19 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి ఊరట కల్పించేందుకు కార్మిక సంఘాలు పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. నిన్న జరిగిన చర్చల్లో కార్మిక సంఘాలు 15-20 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ అంత భారం భరించలేదని సంస్థ ఎండీ సురేంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల ఐకాస వచ్చే నెల 6 నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది.