25న టీడీపీలోకి వంగవీటి రాధా.. కృష్ణాజిల్లా నేతలతో చెప్పిన చంద్రబాబు

  • జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన రాధా  
  • అడిగినంత డబ్బు ఇవ్వలేదనే టికెట్ నిరాకరణ
  • త్వరలోనే చంద్రబాబుతో భేటీ
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ ఈ నెల 25న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ధ్రువీకరించారు. సోమవారం రాత్రి కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల కోసమే రాధాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. రాధాను కలుపుకుని వెళ్లాలని నేతలకు సూచించారు.

వైసీపీకి రాజీనామా చేసిన రాధా సోమవారం రాధా-రంగా మిత్రమండలి సభ్యులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వెల్లడైంది. దీంతో ఆయన టీడీపీలో చేరాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అనంతరం జరిగిన రాధా-రంగా మిత్రమండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్‌పై పలు ఆరోపణలు చేశారు. జగన్ టికెట్లు అమ్ముకుంటున్నారని, అడిగినంత ఇవ్వలేదనే తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అభిమానులు ఎవరూ వైసీపీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. కాగా, త్వరలోనే రాధాకృష్ణ టీడీపీ అధినేత బాబును కలిసే అవకాశం ఉంది.
Go Back to Shorts
Chandrababu
Vangaveeti Radha krishna
Vijayawada
Telugudesam
YSRCP
Jagan

More Telugu News